25, మార్చి 2023, శనివారం

 రంగ మార్తాండ

రంగ మార్తాండ కోసం కృష్ణ వంశీ కంటే ఎక్కువగా ఎదురు చూసాను నేను. దానికి ప్రధాన కారణం నానా పటేకర్ , మేధా మంజ్రేకర్ . ఇవాళ రంగ మార్తాండ ఎలా వుంది అంటే నా జవాబు రెండు రకాలు . ఒకటి బావుంది . ఒకటి బావోలేదు. నటసామ్రాట్ తో పోల్చుకుంటే రంగమార్తాండ బావోలేదు . ఎందుకు పోల్చుకోవడం? అని అడక్కండి. ఒక సృజన రూపాన్ని మళ్ళీ కొత్తగా రీ క్రియేట్ చేసినపుడు పోలిక తప్పకుండా వస్తుంది. ఒక సారి చార్లీ చాప్లిన్ వేషం మీద ఒక పోటీ పెట్టారట. ఆ పోటీ కి చాలామంది చార్లీ చాప్లిన్ రూపం లో వచ్చారట. వాళ్లందరినీ ఒకే వరుసలో నిలబెట్టినపుడు అసలు చార్లీ చాప్లిన్ కూడా వచ్చి వరుసలో చివరగా నిల్చున్నాడట. ఆ పోటీ లో అసలు చార్లీ చాప్లిన్ కి రెండవ బహుమతి వచ్చింది. మొదటి బహుమతి చార్లీ చాప్లిన్ వేషం వేసిన వాడికి వచ్చింది. నేను కూడా రంగ మార్తాండ కి మొదటి స్థానం రావాలని కోరుకున్నా. కానీ నట సామ్రాట్ మొదటి స్థానాన్ని గెలుచుకుంది
కుసుమాగ్రజ్ అనే పేరుతొ పాపులర్ అయిన విష్ణు వామన షిర్వాడ్కర్ రాసిన నటసామ్రాట్ మరాఠీ లో చాలా ప్రసిద్ధి చెందిన నాటకం. దాని ఆధారంగా మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం లో వచ్చిన సినిమా మరాఠీ లో సంచలనం సృష్టించింది. ఒక ప్రసిద్ధి చెందిన నటుడి చివరి రోజులు , నాటకం , కుటుంబ బంధాలలో కనపడకుండా తిష్ట వేసుకుని కూర్చుని బంధాలను ధ్వంసం చేసే డొల్ల తనం, ముప్పేటలుగా అల్లుకున్న కథలో తన టార్గెట్ ఏమిటో మహేష్ మంజ్రేకర్ కి తెలిసినంతగా కృష్ణ వంశీ కి తెలియలేదు .అది పెద్ద లోపం. అయితే ఈ లోపానికి ప్రధాన బాధ్యత వహించాల్సింది కృష్ణ వంశీ కాదు . తెలుగు సమాజం
నాటకం ఇప్పటికీ మహారాష్ట్ర లో సజీవంగా వుంది . సినిమా కి సమాంతరంగా , ఒక్కొక్కసారి సినిమాను సవాల్ చేస్తున్నట్టుగా వుంది. ధర్మకృత్ సుమంత్, మనస్వినీ రవీంద్ర లాంటి కొత్త తరం నాటక రచయతలు మరాఠీ లో సంచలనమ్ సృష్టిస్తున్నారు. కనుక మహేష్ మంజ్రేకర్ తన సినిమాలో టార్గెట్ నాటకం అని ఫిక్స్ అయిపోవడం లో ఎలాంటి సందిగ్ధాన్ని కానీ సంశయాన్ని కానీ పడలేదు. కానీ తెలుగు లో ఇప్పుడు నాటకం లేదు. కొత్త తరం పిల్లలకి నాటకం అంటే తెలియదు. ఒక నాటకం ఆడాలంటే ఎంత కష్టపడాలో తెలియదు. ఒక నాటకం ఆడాక నటుడు పొందే ఆత్మ తృప్తి ఏమిటో తెలియదు. తెలుగులో నాటకాన్ని సినిమా తొంభయి శాతం మింగేస్తే ఆ పదిశాతాన్ని టి వి మింగేసింది. బహుశా ఈ సంగతి తెలుసు కనుకే కృష్ణ వంశీ ముప్పేటలుగా అల్లుకున్న కథలో రెండవ అంశం అయిన వృద్ధాప్యం , పిల్లలు పట్టించుకోక పోవడం అనే అంశాలను టార్గెట్ చేసి ఉంటాడు .
ఈ సినిమా చూస్తున్న ఇరవై , పాతికేళ్ల సాఫ్ట్వేర్ పిల్లలకి తల్లి తండ్రుల దుఃఖం పట్టలేదు. నలభయ్,,యాభయ్ దాటిన ప్రేక్షకుడికి నాటకం కనెక్ట్ అయినా, వాళ్ళ ఇన్స్టింక్ట్స్ ను సాటిస్ఫాయ్ చేసే స్థాయిలో కనెక్ట్ కాలేదు . అందుకే రంగ మార్తాండ నేను బావోలేదు అన్నది .
ఇక ఎందుకు బావుంది? చాలా రోజుల క్రితం సిటీ బ్యూటిఫుల్ , రాముడుండాడు రాజ్యముండాది లాంటి గొప్ప నవలలు రాసిన కేశవరెడ్డి గారు నాతో మాట్లాడుతూ " బ్రహ్మానందం వేసినవన్నీ బిలో యావరేజ్ వెకిలి వేషాలు " అన్నారు. ఇప్పటిదాకా బ్రహ్మానందం అంటే గుర్తుకు వచ్చే కిల్ బిల్ పాండే , మాక్డొవెల్ మూర్తి , జిలేబి లాంటి పాత్రల స్థానం లో ఇప్పుడిక రంగ మార్తాండ వచ్చి చేరుతుంది. బ్రహ్మానందం ఇప్పుడిక రంగమార్తాండ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. ఇది కృష్ణ వంశీకేమో కానీ బ్రహ్మానందానికి మాత్రం ఇది కమ్ బ్యాక్ సినిమానే.
శివగామిగా , నీలాంబరిగా చాలా లౌడ్ గా నటించిన రమ్యకృష్ణ తన పంథా నుండి ఒక్క ఇంచు కూడా అటూ ఇటూ కదలలేదు. ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు. అందులో సందేహం లేదు. కానీ ఇందులో ఆయన ఒకే పాత్ర చేయలేదు. కొన్ని వందల పాత్రలను తనలో ఆవాహన చేసుకున్న నటుడి పాత్రను చేసాడు. ఆ నటుడి పాత్రను చేస్తున్నప్పుడు అండర్ ప్లే చేయవలసిన చోట అండర్ ప్లే చేయాలి . లౌడ్ గా ఉండవలసిన చోట లౌడ్ గా ఉండాలి. ఒక ఒక్కడు లాగో , ఒక అంతఃపురం లాగో చేస్తానంటే కుదరదు . కానీ ఆ సమన్వయం ప్రకాష్ రాజ్ లో లోపించింది . హాస్పిటల్ సన్నివేశం నటసమ్రాట్ లో ఇద్దరు మిత్రుల నటనకి ఒక తారాస్థాయిని ఇస్తే రంగ మార్తాండ లో బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ ను ఓవర్ షాడో చేసేసాడు.
నువ్వు చెత్త నటుడివి రా అంటూ ఒక సన్నివేశం లో బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ ను అంటాడు . నిజం వందల పాత్రలలో నటించిన ఒక గొప్ప నటుడికి జీవితం కూడా ఒక పాత్రే. ఆ పాత్రలలో నటించి భావోద్వేగాలను ప్రదర్శించి మేకప్ తీసివేసిన తరువాత మామూలు మనిషి అయినట్టు నిజ జీవిత పాత్రను కూడా ఒక రంగస్థల పాత్రలాగే తీసుకునే స్థిత ప్రజ్ఞత రావాలి. ఆ స్థిత ప్రజ్ఞత ని నానా పాటేకర్ ప్రదర్శించినట్టుగా ప్రకాష్ రాజ్ ప్రదర్శించలేక పోయాడు. అందుకే నానా పాటేకర్ ను గుండెల్లోకి తీసుకుంటాము . ప్రకాష్ రాజ్ ను అబ్బురంగా చూస్తూ ఉండిపోతాము
మిగిలిన వారిలో శివాత్మిక బాగా చేసింది . ఈ అమ్మాయికి మంచి పాత్రలు పడితే చాలు. తెలుగు సినిమా మరొకరిని వెతుక్కోవలసిన అవసరం లేదు . నిజానికి రంగ మార్తాండ ఆత్మ ను సిరివెన్నెల సీతారామ శాస్తి ఆవాహన చేసుకున్నట్టు ప్రకాష్ రాజ్ చేసుకున్నట్టు లేదు . ఆ " పువ్వై విరిసే ప్రాణం, పండై మురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా బొరుసంతే " రంగ మార్తాండ నిలువెత్తు వ్యాఖ్యానం . కానీ ఇళయ రాజా " ఆసూత్రధారులెవరో" అనే మాటను ఆసూ త్రధారులెవరో గా విడదీయడం మాత్రం చెవులలో గులక రాళ్ళూ దొర్లించినట్టుగా వుంది
అయినా రంగ మార్తాండ బావుంది . ఎందుకంటే నీట్ గ వుంది. బూతులు లేవు . పాడ్ దేంగే లాంటి సంభాషణలు లేవు . కృష్ణ వంశీ నే తన మొగుడు సినిమాలో చేయించినటువంటి బూతు డాన్సులు లేవు .తప్పక చూడండి
May be an image of 4 people and text
All reactions:
సుభాషిణి తోట, Palamaner Balaji and 107 others

2, నవంబర్ 2020, సోమవారం

విషాద నీలిమ మేఘ్ డాకా తారా

 విషాద నీలిమ మేఘ్ డాకా తారా

" Tagore once said - art has to be beautiful, but, before that, it has to be truthful. Now, what is truth? There is no eternal truth. Every artist has to learn private truth though a painful private process. And that is what he has to convey."
" ఈ సత్యం ఎక్కడినుండి ఎలా వస్తుంది అంటే కళాకారుడి దృక్పధం లో నుండి , కళాకారుడి అంతర్మథనం , అంతర్ ధ్యానం లో నుండి సత్యం తన రూపాన్ని వెతుక్కుంటుంది. సత్యం సాపేక్షం గా ఉండి క్షణ క్షణం మార్పులకు లోనయ్యే ఈ విశ్వం లాంటిది కనుక ప్రతి ఒక్కళ్ళూ తమదైన సత్యాన్ని తమ జీవితపు సుదీర్ఘమైన , లోతైన అనుభవాలలో నుంచి , ఆలోచనలలో నుంచి అన్వేషించాలి .

విస్మయ పరచే టోఫీ మాస్టర్

 విస్మయ పరచే టోఫీ మాస్టర్

" Life is simple and the man continues to complicate it by waving the still water "
అంటాడు యాసుజిరో ఓజో . అవును ! జీవితం చాలా సరళంగానూ , సుందరంగానూ , సున్నితంగానూ ఉంటుంది . మనిషి దాన్ని తన వైవిధ్యభరితమైన భావజాలాల తోనూ , సమాజాన్ని , రాజ్యాన్ని , జీవితంలోకి చొరబడటానికి అప్రయత్నంగా అనుమతించడం ద్వారాను సంక్లిష్టం చేస్తాడు . ఇలా సంక్లిష్టం చేయడం నిరంతరం జరిగే ఒక విషాద చర్య . ఓజో స్టిల్ వాటర్ అని అన్నాడు కానీ నిజానికి అది బాయిల్డ్ వాటర్ .

 అతడి రొట్టె -ఒక ధ్యానాత్మక వ్యక్తీకరణ

కొన్ని పుస్తకాలని రుచి చూసి వదిలివేయాలి . కొన్ని పుస్తకాలని నమిలి మింగి జీర్ణం చేసుకోవాలి అన్న బేకన్ మాటలు పుస్తకాలకే కాదు సినిమాలకు కూడా వర్తిస్తాయి . కొన్ని సినిమాలను రుచి చూసి వదిలివేయాలి . కొన్ని సినిమాలను జీర్ణం చేసుకుని రక్త మజ్జాస్థిగతమ్ చేసుకోవాలి . దురదృష్ట వశాత్తు మన దగ్గర రుచి చూసి వదిలివేయదగిన సినిమాలే ఎక్కువ
సినిమా కథను , కథను చెప్పే విధానాన్ని ఒక మూసలో బంధించి , ఒక చట్రం లో ఇమిడ్చి సరికొత్త ప్రయోగాలకు తలుపులు మూసేసింది సాంప్రదాయ సినిమా . ఒక అందమైన అమ్మాయి , అంతకంటే అందమైన అబ్బాయి , వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ , ఆ ప్రేమను అడ్డుకునే కులమో , మతమో ధనమో, ఆ అడ్డుగోడలని ఛేదించి ఇద్దరూ ఏకమవ్వడం అనే ఫార్ములా తో వెండి తెరను ఎన్ని సినిమాలు వెలిగించాయో చెప్పలేము
లేదా ? ఒక ధనికుడు , ఒక భూస్వామి , ఒక జమీందారు అతడి దగ్గర పనిచేసే కార్మికుడు , కర్షకుడు ఇద్దరి మధ్యా ఒక సంఘర్షణ చివరకు యజమాని ఓడిపోయి సేవకుడు గెలవడం యజమాని అనే చేదు మీద సేవకుడు అనే మంచి గెలవడం అనే ఫార్ములాతో ఎన్ని సినిమాలు భారతీయ వెండి తెర మీద వీర విహారం చేశాయో చెప్పలేము . పైకి భిన్న సినిమాలుగా కనిపించినా ఇదంతా ఒకే చట్రం . ఒకే ఛత్రం
ప్రతి పదేళ్లకు కవిత్వం తన ఫార్మ్ లేదా రూపాన్ని మార్చుకుంటుంది . ప్రతి పదిహేనేళ్లకు సమాజం తన ధోరణి మార్చుకుంటుంది . అలాగే సినిమా కూడా తన ఫార్మ్ మార్చుకుంటుందా ? Some times reality is stranger than fiction అని కదా అనేది . సినిమా అనే కల్పన జీవితం అనే వాస్తవాన్ని ఒడిసి పట్టుకుంటుందా ? ఈ ఆలోచనలోంచే పథేర్ పాంచాలి వచ్చింది . భారతీయ సినిమాను ఓకే కుదుపు కుదిపింది . అది నవ్య సినిమాకు మార్గదర్శకత్వం వహించింది
మృణాళ్ సేన్ , సత్యజిత్ రే , ఆదూర్ గోపాలకృష్ణన్ , శ్యామ్ బెనగళ్ , గిరీష్ కాసరవల్లి , పఠాభి , నరసింగ రావు , గౌతమ్ ఘోష్ ఒకరా ఇద్దరా ? ఎంతోమంది నవ్య సినిమాను తమ భుజాల మీద మోశారు . భారతీయ ప్రధాన స్రవంతి సినిమాకు ధీటుగా నవ్య లేదా పారలల్ సినిమాను నిలిపారు . ఒక దశకు వచ్చేసరికి పారలల్ సినిమాలో కూడా ఒక మొనాటనీ వచ్చింది . ఒక దర్శకుడు అయిత్ తెర మీద సిగరెట్ కాల్చే దృశ్యాన్ని దాదాపు పదినిమిషాలపాటు చిత్రీకరించి ప్రేక్షకుడి సహననానికి పరీక్ష పెట్టాడు . మరొక దర్శకుడు పెనం మీద నీరు ఆవిరి అయ్యే దృశ్యాన్ని షాట్ కట్ చేయకుండా ఐదు నిమిషాలపాటు చిత్రించాడు . అంటే మితిమీరిన వాస్తవికత పారలల్ సినిమాను మార్నింగ్ షో సినిమాగా , ఫిలిం ఫెస్టివల్ సినిమాగా మార్చేశాయి
అప్పుడు వచ్చిన మణి కౌల్ ఉస్కీ రోటీ సినిమా సాంప్రదాయ సినిమా తో పాటు పారలల్ లేదా నవ్య సాంప్రదాయ సినిమా గ్రామర్ ను కూడా తిరగ రాసింది . సత్యజిత్ రే అయితే ఉస్కీ రోటీ చూసి వెండి తెర మీద ఎడతెగని కవిత్వ ధార అన్నాడు . ఉస్కీ రోటీ తో చరిత్రలో మరొక కొత్త అధ్యాయం మొదలు అయింది . ఏమిటీ ఉస్కీ రోటీ ? ఎవరీ మణికౌల్
మణి కౌల్ , ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లో చదువుకున్నాడు . ప్రముఖ బెంగాలీ దర్శకుడు రిత్విక్ ఘటక్ కు ప్రియమైన శిష్యుడు . ఫ్రెంచ్ రాబర్ట్ బ్రేస్సేన్ , రష్యన్ టర్కోవస్కీ ల భావజాలాలతో , వాళ్ళ సినిమా నిర్మాణ పద్దతులతో ప్రభావితం అయినవాడు . రాజ్ కపూర్ తో సాప్నోంక్లి సౌదాగర్ లాంటి సినిమాలు తీసిన మహేష్ కౌల్ కి స్వయంగా మేనల్లుడు
తన సినిమా కెరీర్ ను ఉస్కీ రోటీ అనే ఫీచర్ ఫిలిం తో మొదలు పెట్టి డాక్యుమెంటరీలు , డాక్యు డ్రామాలతో కలుపుకుని మొత్తం ఇరవైరెండు కి పైగా దృశ్య కావ్యాలను నిర్మించాడు . దువిధ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడు గాను , సిద్దేశ్వరి కి గాను ఉత్తమ డాక్యుమెంటేరియన్ గాను జాతీయ అవార్డులతో పాటు నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు . హిందూస్థానీ సంగీతం లో మంచి పట్టు , కవిత్వం , చిత్రలేఖనం పట్ల మంచి అభిరుచి ఉన్న కౌల్ తన సినిమాలను అందమైన పెయింటింగ్స్ లా , అద్భుతమైన కవిత్వ ఖండికలుగా , వెంటాడే సంగీత స్వరాలుగా తీర్చిదిద్దాడు
ఉస్కీ రోటీ సినిమా చూస్తుంటే మనకు శ్యామ్యూల్ బెకెట్ వెయిటింగ్ ఫర్ గోడో లేదా త్రిపుర భగవంతం కోసం గుర్తుకువస్తుంది . వెయిటింగ్ ఫర్ గోడో లో కానీ భగవంతం కోసం లో కానీ దేనికోసం నిరీక్షణో తెలియదు కానీ ఈ ఉస్కీ రోటీ లో ఆ అమ్మాయికి దేనికోసం ఎదురు చూస్తున్నదో మనకు క్లియర్ గా తెలుస్తుంది . కానీ నిరీక్షణ మూడింటిలో ఒకటే .
మోహన్ రాకేష్ రాసిన ఒక చిన్న కథ కి అదే పేరుతొ మణికౌల్ ఇచ్చిన సినిమా రూపం ఉస్కీ రోటీ . కథగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు . హర్యానా లోని ఒకానొక చిన్న గ్రామం లో బాలో , సుచాసింగ్ భార్యాభర్తలు . సుచాసింగ్ ఒక ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తూవుంటాడు . వారానికి ఒక్క రోజు , మంగళ వారం మాత్రమే ఇంటికివస్తాడు . వూరికి దూరంగా ఉన్న రహదారిమీదకు ఆ ట్రాక్ వచ్చే సమయానికి రొట్టెలు తయారు చేసుకుని వెళ్లి సుచాసింగ్ కి ఇవ్వాలి బాలో . కొన్ని సంవత్సరాలుగా అదే ఆమె దినచర్య . సుచాసింగ్ ఎక్కువరోజులు టౌన్ లోనే గడుపుతాడు . ఒక్క మంగళ వారం మాత్రమే తన పల్లెకు వస్తాడు . పల్లెలో బాలో తన చెల్లెలు తో కలిసి ఉంటుంది . ఒక పోకిరీ చెల్లెలు తో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అతడి నుండి చెల్లెలును కాపాడుకుని రొట్టెలు తీసుకుని వెళ్లేసరికి ట్రక్ వెళ్ళిపోతుంది . ఆమె సమయానికి రొట్టెలు తీసుకుని రాలేదు అన్న కోపం తో ఆ మంగళవారం సుచాసింగ్ ఇంటికి రాడు . ఈ అనుభవం తో బాలో రొట్టెలు తీసుకుని వెళ్లడం లో చాలా అలెర్ట్ గా ఉంటుంది . ఆ రోజు కూడా రొట్టెలు తీసుకుని వెళుతుంది . విశాలమైన రహదారి వెంట ఒంటరిగా ఉన్న ఒక చెట్టు కింద బల్ల మీద కూర్చుంటుంది . ట్రక్ వచ్చిందో తెలియదు . రాలేదో తెలియదు . ఆమె ట్రక్ వచ్చే వైపు కళ్ళని పత్తికాయల్లా విప్పార్చుకుని చూస్తూ ఉంటుంది
సమయం గడచి పోతుంది . ట్రక్ రాదు . ఆమె నిరీక్షణ కి అంతం లేదు . ఒక ముసలివాడు ట్రక్ వెళ్లిపోయిందేమో ఇంక ఈ రోజుకు ఇంటికి వెళ్లకూడదూ అంటే లేదు ట్రక్ వస్తే ఇబ్బంది కదా అంటుంది . సాయంత్రం అవుతుంది . నిర్మానుష్యమైన , నిర్జనమైన రహదారి మీద ఒంటరి ఆడపిల్ల బాలో అలా నిరీక్షిస్తూ ఉంటుంది .. ఒక్కొక్క సారి ట్రక్ వచ్చినా ఆపకుండా ఆమె వంక చూస్తూ వెళ్ళిపోతాడు సుచాసింగ్ .
నిజానికి సుచాసింగ్ కి బాలో అంటే పెద్ద ప్రేమ లేదు . ప్రేమ లేకపోతే పోయే కనీసం ఆమెను ఒక మనిషిగా కూడా గుర్తించడు . అతడికి డ్యూటీ లేని సమయం లో కార్డ్స్ ఆడుతూ , మద్యం సేవిస్తూ , వేశ్యల వొళ్ళో వాలిపోతాడు. " అతడికోసం ఎందుకలా ఎదురు చూడటం ? " అని
ప్రేక్షకుడికి అనిపించినట్టు బాలో చెల్లెలు కు కూడా అనిపించి ఒక సారి " ఎందుకలా అతడికోసం రొట్టెలు తయారు చేసుకుని వెళ్లి ఎదురు చూడటం ?" అని అడుగుతుంది . అలా వెళ్లకపోతే ఆ వచ్చే మంగళ వారం కూడా అతడు రాడు కదా అంటుంది బాలో . బాలో అలా ఆ చెట్టుకింద ఎదురుచూస్తూనే ఉంటుంది . దూరంగా ఒక పొగ మేఘం లా కమ్ముకుని కనిపిస్తుంది
ఇంతే సినిమా
బ్రెస్సన్ సినిమాటిక్ శైలిని తీసుకున్నా భారతీయ ఆత్మను వదలలేదు మణికౌల్ . బ్రెస్సన్ సినిమాలు చూసిన వాళ్లకి అతడి శైలి అవగతమే . మనం మామూలుగా ఒక పాత్రను ఒక నటుడు పోషిస్తున్నాడు అంటే ఆ పాత్ర భావోద్వేగాలు అన్నిటినీ ఆ నటుడు తన మొహం లో ప్రతిఫలింప చేయాలి అనుకుంటాము . ఏ నటుడైనా మొహం లో ఒక్క భావోద్వేగం అయినా పలికించకపోతే " expression less face అనుకుంటాము . బ్రేస్సేన్ కి ఫేస్ తో పని లేదు . అతడి సినిమాలలో నటులు కెమెరాను ఫేస్ చేయడం చాలా ,చాలా తక్కువ . ఎందుకంటే
‘two types of film: those that employ the resources of theatre and use the camera in order to reproduce; [and] those that employ the resources of cinematography and use the camera to create.’ For Bresson, film had no place for precepts of the stage. Loud performances, imitative narratives, and melodramatic grandeur were artefacts from another form. They work in theatre due to ‘flesh-and-blood’ presence. Bresson believed that translating this to film was like photographing a painting: a realistic copy, but undeniably lesser.
ఇది బ్రెస్సన్ సినిమా శైలి కి సంబంధించిన తాత్వికత . భారతదేశం లో సినిమాకు మాతృక నాటకమే . కనుక మన తొలి సినిమాలు అన్నీ అచ్చు నాటకాల లాగే ఉండేవి . ఇప్పటికీ ఒక నటుడు తాను ధరిస్తున్న పాత్రను ఆవాహన చేసుకుని నవ్వకపోతేనూ , విలపించకపోతేనూ , వియోగ భారంతో చెట్టు పుట్టల వెంట పరుగులిడకపోతేనూ మనకు ఆ నటన సంతృప్తిని ఇవ్వదు , మహానది సినిమాలో కమల హాసన్ వేశ్యావాటికలో కూతురు ను చూసినప్పుడు మొహం లో పలికించిన భావోద్వేగం , కురిపించిన కన్నీళ్లు ఈ నేపధ్యం తో తలచుకుంటే మనకు కావలసినింత వినోదాన్ని ఇస్తుంది
బ్రెస్సన్ సినిమా నిర్మాణం లో చెప్పిన మరొక పాఠం ‘If an image, looked at by itself, expresses something sharply, if it involves an interpretation, it will not be transformed on contact with other images… it is definitive and unusable in the cinematographer’s system.’ By this he means that an image that has meaning in itself is uncinematic. The point of film, as he sees it, is for meaning to be suggested by association and by contradiction. The essence of editing is way in which images, who themselves have limited meaning, interact and create something new.
ఒక ఇమేజ్ కానీ ఒక దృశ్యం కానీ దానికి అదే ఒక అర్ధాన్ని ఇస్తుంది . అది మరొక ఇమేజ్ తో కలిసినప్పుడు లేదా మరొక దృశ్యం లో సంలీనం అయినప్పుడు అది తన సహజమైన అర్ధాన్ని కోల్పోతుంది . అందుకనే ఈ సినిమాలో మణికౌల్ బాలో చేతిని పదే పదే ప్రత్యేకంగా చూపిస్తాడు . ఎక్కడికి అక్కడ దృశ్యాన్ని కట్ చేసి ప్రేక్షకుడి వూహ కి ఒక స్పేస్ ను ఇస్తాడు .
ఒక్కొక్క సారి సుచాసింగ్ ట్రక్ బాలో దగ్గర ఆపకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోవడం లో ఒక అపరాధభావాన్ని ఆ నిర్లక్ష్యం లో దర్శకుడు పూల దందా లో దారం లా ఇమిడ్చాడా అన్న సందేహం ప్రేక్షకుడికి వస్తుంది . అలాగే ఆ సుదీర్ఘ నిరీక్షణ కూడా ప్రేక్షకుడితో పాటు పాత్ర కి కూడా అంటే బాలో కి కూడా ఎక్కడో విసుగును తెప్పిస్తుంది . అలా తెప్పించాలి కూడా . అప్పుడా విసుగులో నుండి ఒక కొత్త ఆలోచన బాలో లో ఒక తిరుగుబాటుకు దారి తీయాలి . దూరంగా కనిపించే ఒక పొగ మేఘం కూడా
ఒక కవిత లో కవి వేసే పదబంధం లేదా ప్రతీక చదివిన లక్ష మంది పాఠకులకు లక్ష రకాలుగా అర్ధం అయినట్టు మణి కౌల్ చిత్రీకరణ కూడా చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్లకు మాత్రమే పరిమితమయ్యే రీతిలో అర్ధం అయి కొత్త ఆలోచనలు కలిగించాలి . ధ్యానము అందరూ చేస్తున్నా అది కల్పించే ప్రకంపనలు ఎవరికీ వారికీ ప్రత్యేకం అయినట్టు ఈ రకమైన చిత్రీకరణ శైలి కూడా ప్రేక్షకుడి మేధకి కి పదును పెడుతుంది
మన పది కదలికలలో తొమ్మిది కదలికలు మన అలవాట్లకు , ఆటోమాటిజానికి లోబడి ఉండేవే . వాటిని బద్దలు చేసి ఆ కదలికలకు వాటి సహజ రూపాన్ని ఇవ్వడమే మణి కౌల్ ఉస్కీ రోటీ లో చేసిన పని . ఇదొక ధ్యానాత్మక వ్యక్తీకరణ
నవ తెలంగాణ సోపతి 01/11/20 సౌజన్యంతో
Image may contain: one or more people



1, ఫిబ్రవరి 2018, గురువారం

కవిత్వ ప్రపంచం

దిగంబర కవిత్వం - గురించి 


జీవితం ,ప్రేమ ,కవిత్వం ఎప్పుడూ స్తబ్ధు గా ఉండవు . చలనం వాటి లక్షణం . ఎప్పుడైనా స్తబ్దత అలుముకుంటున్నది అనుకున్నప్పుడు ఎదో ఒక సంఘటనో , శరాఘాతామో ,షాక్ ట్రీట్మెంటో  జరిగి వాటిని గమనాన్ని మారుస్తాయి