24, జులై 2011, ఆదివారం

ఒక సర్వనామం గురించి .......

ఒక సర్వనామం గురించి .......


జీవితం చాలా విలువైనది. ఈ మాటను మనం చాలా సార్లు విని , రాసి, చదివి ఉంటాము. ఇప్పుడిలా కొత్తగా చెపుతున్నట్టు జీవితం చాలా విలువైనది అని రాస్తూ వుంటే నాకే నవ్వు వస్తోంది. కానీ జీవితాన్ని దాని నిండైన అర్థం తో, నిజమైన స్పూర్తితో మన స్వీకరించామా అంటే లేదు అనే జవాబు వస్తుంది. చాలా చిన్న చిన్న విషయాలకే మనం జీవితాన్ని అంతం చేసుకోవాలని చూస్తాము. ప్రేమ విఫలమైంది అనో , పెళ్లి శకలమైంది అనో, మనసు వికలమైంది అనో, పరీక్షలో ఆశించిన మార్కులు రాలేదు అనో, వచ్చిన మార్కులు సరిపోలేదు అనో , చివరాఖరికి అభిమానించే నటుడో, రాజకీయ నాయకుడో మరణించాడు అనో, అర్రెస్ట్ అయ్యాడు అనో జీవితాన్ని అర్థాంతరంగా ముగించే వాళ్లకు మన సమాజంలో కొదవ లేదు. ఎందుకని? ప్రపంచీకరణ ప్రభావంతో పెరిగిపోతున్న ధనిక పేద అంతరాలు, క్షణ క్షణం అభివృద్ధి చెందుతున్న సమస్యలు, విస్తరిస్తున్న పెఅజ్ త్రీ\ సెలబ్రిటి సంస్కృతి,ఈ ఆత్మ హత్యలకు కారణం అవుతున్నాయా? జీవితాన్ని జీవించడము తెలియక, ముగించడము తెలియక ఇప్పటి తరం ఎందుకిలా మృత్యు గాత్ర పరిష్వంగం లో ఓదార్పు పొందుతున్నది? ఏ అనుభూతులకు, వాటి ఆనుభవిక సంస్పందనలకు నోచుకోకుండా , ఈ అందమైన ప్రపంచానికి మధ్యలోనే వీడ్కోలు పలికి రహస్య దారులవెంట , హడావిడి గా వెళ్ళిపోతున్నారు? లోకం లో దుఖం వుంది నిజమే. దానితోపాటే ఆనందం కూడా వుంది. వేదన వున్నది నిజమే కానీ దాని వెనుక వేడుక కూడా వున్నది. ఒక పార్శ్వాన్ని చూసి, మరొక దానిని చూడ నిరాకరిస్తే అది ఈపాటికి సమ్యక్ దృష్టి అవదు. వెండి మబ్బుకు అమరితేనే జరీ అంచుకు విలువ వస్తుంది. దుఖం అనుభవం లోకి వస్తేనే కదా సుఖం సౌందర్యం ఏమిటో అవగతమయ్యేది. ఒక సమస్యలో కూరుకొని పోయి, దానితో పోరాడి, గెలిస్తేనే , సమస్య అంతులేని సుడిగుండాలు వున్న సముద్రం కాదని తెలిసేది. ఇవాళ సమాజం మొత్తం గా ఒక ద్వంద్వం లో తనను తాను అన్వేషిస్తున్నది. ఒక పక్క చీమకు కూడా హాని తల పెట్టని సాదు స్వభావం, మరొక పక్క ప్రాణాలని మొక్కజొన్న పేలాలు ఎగిరినంత తేలికగా పైకి పంపించగల క్రూరత్వం నలువైపులా కనిపించి మనిషిని ఒక అంతులేని గందరగోళం లో కి నేట్టుతున్నదా? మనిషికి సర్వనామం మృత్యువు అవడానికి ఇవాళ కారణ భూతం అయిన వారు ఎవరు? ఒక శ్రీకాంతా చారి, యాదయ్య, వేణుగోపాల రెడ్డి, ఇప్పుడు యాది రెడ్డి, పేరు ఏది ఐతేనేం? మృత్యువు తనను తాను విస్తరింప చేసుకోవడానికి వెతుక్కున్న వాహికలు వారు. వారి మరణం వెనుక వారి మానసిక బలహీనత ఎంత? ఉద్యమ తాత్వికత ఎంత? నేతల అసమర్ధ అవగాహనా రాహిత్య, స్వప్రయోజనకర రాజకీయ లౌల్యమెంత? ఇన్ని మరణాలని దాటి వచ్చిన తర్వాతా కూడా ఉద్యమ పంధా మారక పోతే రేపు ఎప్పుడో ఈ పాపం ఎవ్వరిదని వెర్రి గాలి తరగ ఒకటి నిలదీసి మరీ ప్రశ్నిస్తుంది. ఆత్మసాక్షి ఎదురు తిరిగి మరీ శిక్షిస్తుంది. తెలంగాణా వచ్చినా, రాకపోయినా, ప్రజలు కలసి వున్నా, విడిపోయినా, ఆత్మహత్యలు మరకలుగా ఉద్యమ ఆకాశం మీద మిగిలి పోక తప్పదు. యాది రెడ్డి తన ఉత్తరం లో కోరుకున్నట్టుగానే ఇది యముని మహిషపు లోహ ఘంటల ఆఖరి సవ్వడి కావాలి. చర్చలు చేసేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. కలసివుండటం అనేది ఒక అందమైన స్వప్నం. సహజీవనం అనేది చాల సహనం తో, సంయమనంతో, ప్రజస్వ్యామ్య దృక్ఫదం తో, త్యాగ గుణం తో నిరంతరం కొనసాగించాల్సిన ఒక అందమైన ఒక అతి కష్టమైనా , జేవితాంతం కొనసాగించాల్సిన ప్రక్రియ. త్యాగం లేకుండా, సహనం, లేకుండా అన్నిటిని మించి సాటి మనిషి పట్ల ప్రేమ లేకుండా సహజీవనం సాధ్యపడదు కాక సాధ్యపడదు. కలసి వుండాలి అనే వాళ్ళు ఇప్పుడిక ఏ ఏ త్యాగాలు చేస్తారో చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. యధాతధ స్థితి కొనసాగించాలి అనుకుంటే అది సాగని పని. కేసి కెనాల్ మీద వున్న ఆర్ డి ఎస్ తూములని బద్దలుకొట్టి మరీ నీళ్ళు తరలించుకోకుండా ఉండగలరా? మూడో పంటకి నీళ్ళ కోసం పులిచింతల కోసం పట్టుపట్టకుండా పాలమూరు బీడు భూములలోకి క్రిష్ణమ్మని బిరా బిరా ప్రవహిమ్పచేయగాలరా? హైదరాబాద్ ఆరో జోను లో భాగమని వోప్పుకోగాలరా?భద్రాద్రి రాముడి పాదాలని ముద్దాడే పవనోత్తున్గా తరంగ గోదారి గంగ ఆ భద్రాద్రి రాముడినే జల సమాధి చేయగల పోలవరం ప్రాజెక్ట్ కి వీడ్కోలు పలికి ప్రత్యమ్నాయ ఆలోచన చేయగలరా? ఏ త్యాగము చేయకుండా కలసి వుండాలని లాబీయింగ్ మాత్రమే చేయగలరా? తేల్చుకోవలసింది నేతలే. అందాక ఒకటే మాట " జీవితం విలువైనది దానిని ఆత్మహత్యలతో అర్థ రహితం చేయ వద్దు" తెలంగాణా రావచ్చు, రాక పోవచ్చు. అది మీ చేతుల్లో లేదు. కానీ మీ జీవితం మీ చేతుల్లోనే వుంది. దాని అనాధను చేయకండి.

3 కామెంట్‌లు:

  1. నిజం వంశీ...
    జీవితాన్ని అనాధని చెయ్యొద్దన్న మీ సూచన బావుంది.ఈ రోజు జ్యోతిలో కె.యస్. కాలమ్ చదివే మనసు మూగబోయింది.ఇపుడు మీ వ్యాసం....

    రిప్లయితొలగించండి
  2. వంశీ, సరిగ్గా చెప్పావు. మనసు ఆర్ద్ర మయిపోయింది.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగా స్పందింప జేశారు. ఒక అవసరం గురించి వక్కాణించారు.ఇలా చెప్పడం అవసరం కూడా..

    రిప్లయితొలగించండి